ఈ ఫొటోలో కనిపిస్తోన్న యువతి పేరు దివ్యశ్రీ. వయస్సు 21 సంవత్సరాలు. అందం, అణకువ ఉన్న అమ్మాయి. పేరున్న సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తూ, మంచి జీతాన్ని అందుకుంటోంది. ఆ యువతి చేసిన ఓ చిన్న పొరపాటు.. ఆమె బంగారు జీవితాన్ని చిదమేసింది. కన్న వాళ్ల కలలను ఛిద్రం చేసింది.
నడుస్తున్న రైల్లో ద్వారం వద్ద నిల్చుని సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన ఆ యువతి..మలుపులో కుదుపులకు లోనైంది. నడుస్తున్న రైల్లోంచి కిందపడింది. అంతే! తీవ్ర గాయాల పాలైన ఆ యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషాదకర ఘటన కర్ణాటకలోని హసన్ జిల్లాలో చోటు చేసుకుంది.
మండ్య జిల్లా కేఆర్ పేటె తాలూకా మేటిమళ్లిళ్ల గ్రామానికి చెందిన దివ్యశ్రీ బెంగళూరులో ఓ ప్రైవేటు సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తోంది. బుధవారం ఆమె తన స్నేహితులతో కలిసి హసన్ జిల్లా చెన్నరాయ పట్టణ తాలూకా పరిధిలోని ప్రఖ్యాత పర్యాటక కేంద్రం శ్రావణ బెళగోళను సందర్శించింది. సాయంత్రం బెంగళూరుకు వెళ్లడానికి చెన్నరాయ పట్టణలో రైలు ఎక్కారు.
రైలు హిరిసావ స్టేషన్కు చేరుకుంటున్న సమయంలో.. ఆమె ద్వారం వద్ద నిల్చుని, సెల్ఫీ తీసుకోబోతూ పట్టుతప్పి కింద పడ్డారు. దీనితో ఆమె సంఘటనాస్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. స్థానికులు వెంటనే- ఆమెను బెంగళూరు శివార్లలోని బీజీఎస్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ఆరంభించారు.